New Delhi: లేటు వయసులో డేటింగ్ కోరితే... రూ. 46 లక్షలు లాగేసిన అమ్మాయి!

  • న్యూఢిల్లీలో మోసపోయిన వృద్ధుడు
  • ఓ అమ్మాయిపై ఆశతో లక్షలు సమర్పించుకున్న వైనం
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

ఉద్యోగం నుంచి రిటైర్ అయిన 65 ఏళ్ల వృద్ధుడు, లేటు వయసులో ఎవరితోనైనా డేటింగ్ చేయాలని భావిస్తే, అతని కోరికను అలుసుగా తీసుకున్న డేటింగ్ వెబ్ సైట్, ఓ అమ్మాయిని రంగంలోకి దించగా, మాయమాటలు చెబుతూ, రూ. 46 లక్షలు లాగేసిన ఘటన ఇది. తనకు వచ్చిన పదవీ విరమణ సొమ్మంతా ఇలా పోగొట్టుకున్నానని ఇప్పుడు వాపోతున్నాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీకి చెందిన వృద్ధుడు, ఓ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోగా, తొలుత మీరా అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. ప్రీమియం మెంబర్ గా రిజిస్టర్ కావాలని కోరితే, ఆ పని చేశాడు. ఆపై ముగ్గురు మహిళల ఫొటోలను పంపగా, ఒకరిని ఎంచుకున్నాడు. ఆమెతో ఏడాది డేటింగ్ చేసేందుకు రూ. 10 లక్షలు కట్టాలని చెబితే, ఆశతో ఆ డబ్బు కట్టాడు. ఆపై తాను ఎంపిక చేసుకున్న మహిళ రోజీ అగర్వాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కూడా సాకులు చెబుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అడిగినప్పుడల్లా డబ్బు పంపుతున్నా, ఆమె డేటింగ్ కు రాలేదు.

ఆపై తాను రిజిస్టర్ చేసుకున్న వెబ్ సైట్ ను పరిశీలించగా, అది ఓ మోసపూరిత వెబ్ సైట్ అని రివ్యూలు చూసి, తాను మోసపోయానని గ్రహించాడు. పరువు పోతుందని భావించిన ఆయన కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి, చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

More Telugu News