lovers death: హత్యా? ఆత్మహత్యా?... ప్రేమ జంట మృతిపై అనుమానాలు

  • చనిపోక ముందు ఓ పెళ్లికి హాజరైన జంట
  • తిరుగు ప్రయాణంలో ఘటన
  • చంపి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానం

ఇంటర్‌ చదువుతున్న ప్రేమ జంట విషాదాంతంపై అనుమానాలు మొదయ్యాయి. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తొలుత భావించినా, ఎవరైనా చంపేసి వీరిని పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం   పిట్టలగూడెంకు చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరిలు ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ పరిధిలోని ఉందానగర్‌-తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య పిల్లోనిగూడ వద్ద రైల్వే పట్టాలపై విగతజీవులుగా పడివుండగా గుర్తించిన విషయం తెలిసిందే. వీరు ఆత్మహత్య చేసుకున్నారని భావించారు. అయితే చనిపోవడానికి ముందు వీరిద్దరూ ఓ పెళ్లికి హాజరై అక్కడ సెల్ఫీ తీసుకున్న విషయం బయటపడింది.

స్నేహితుడి పెళ్లి ఉందని తండ్రికి చెప్పి శ్రవణ్ కారు తీసుకురాగా, స్నేహితురాలి పెళ్లి ఉందని మయూరి ఇంట్లో చెప్పి శ్రవణ్‌తో కలిసి కారులో బయలుదేరింది. పెళ్లి పూర్తయ్యాక తిరిగి నందిగామకు బయలుదేరిన వీరు కొద్దిసేపటికే చనిపోవడం, పట్టాల పక్కన కారు నిలిపి ఉండడంపై అనుమానం వ్యక్తమవుతోంది.

పైగా రైలు ఢీకొట్టి చనిపోతే శరీర భాగాలు తునాతునకలవుతాయని, పట్టాల మధ్యన పడుకోబెట్టినట్లు వీరిద్దరి శవాలు దగ్గరదగ్గరగా పడివుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి పట్టాలపై పడేసి ఉంటారని, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు.

More Telugu News