YSRCP: నా బిడ్డది ఎవరి కాళ్ల మీద పడే మనస్తత్వం కాదు: వైఎస్ విజయమ్మ

  • జగన్ అప్పుడే భయపడలేదు
  • ఇప్పుడు భయపడతాడా?
  • వైస్ కుటుంబం ప్రజలకు రుణపడి ఉంటుంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆమె మాట్లాడుతూ, తన బిడ్డ జగన్ ఎవరి కాళ్ల మీదా పడే వ్యక్తి కాదని, జగన్ వ్యక్తిత్వం అలాంటిది కాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పదేపదే జగన్ ను కేసీఆర్ కాళ్ల వద్ద ఊడిగం చేసుకో అనడం పట్ల విజయమ్మ స్పందించినట్టు పైవ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ పై కక్షబూని కేసులు పెట్టారని విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు వస్తానని జగన్ మాటిచ్చాడని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని పేర్కొన్నారు.  తమ కుటుంబం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అభిమానులే అండగా నిలిచారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.

తనపై ఎన్ని కుట్రలు చేసినా జగన్ అప్పుడే భయపడలేదని, ఇప్పుడసలు భయపడడని విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్ తిండి లేకుండా దీక్షలు చేస్తే, చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. జగన్ పోరాడబట్టే నేటికీ ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని వివరించారు.

More Telugu News