KA Paul: జగన్, విజయసాయిరెడ్డి నాపై కుట్రలు పన్నుతున్నారు: కేఏ పాల్

  • ఎన్నికలను రద్దు చేయాలి
  • ప్రాణ హాని ఉందన్నా స్పందించట్లేదు
  • గన్‌మన్‌ని పంపి చేతులు దులుపుకున్నారు

ప్రజల్లో తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేక కుట్రలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు కేటాయించిన గుర్తులనే టీడీపీ, వైసీపీ మద్దతుదారులకు కూడా కేటాయిస్తున్నారని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. తమకు కేటాయించిన హెలికాఫ్టర్ గుర్తును కర్నూలులో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పార్టీ అభ్యర్థుల బీ ఫారాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, సంతకాలను సైతం ఫోర్జరీ చేసి వేరే వారికి సీట్లు కేటాయించారని పాల్ ఆరోపించారు. తనకు ప్రాణ హాని ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క గన్‌మన్‌ని పంపి చేతులు దులుపుకున్నారు, నా ప్రాణమంటే అంత చులకనా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు ఆంధ్రా రాజకీయాలతో సంబంధమేంటని నిలదీశారు. అవినీతిపరుడైన జగన్‌తో సంబంధం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని పాల్ వ్యాఖ్యానించారు. జగన్, విజయసాయిరెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని, తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకుని, గుండు గీసే చంద్రబాబు, జగన్ లాంటి నాయకులు కావాలో, లేదంటే గుండె ధైర్యమున్న తనలాంటి నాయకుడు కావాలో తేల్చుకోవాలని కేఏ పాల్ తెలిపారు.

More Telugu News