Ganta Srinivasa Rao: జగన్ నామినేషన్ పత్రాల్లోని సగం పేజీల్లో అవి.. మిగతా సగంలో ఇవి: మంత్రి గంటా ఆరోపణ

  • 51 పేజీల నామినేషన్‌ను దాఖలు చేసిన జగన్
  • వాటి నిండా కేసులు, ఆస్తుల వివరాలేనన్న మంత్రి గంటా
  • దేశంలోనే ఇన్ని కేసులున్న నాయకుడు మరొకరు లేరని ఎద్దేవా

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సమర్పించిన 51 పేజీల నామినేషన్ పత్రాల్లోని సగం పేజీల్లో కేసుల వివరాలు, మిగతా సగం పేజీల్లో ఆస్తుల వివరాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం సిగ్గుచేటన్నారు. ఇన్ని కేసులు ఉన్న నాయకుడు దేశంలోనే మరొకరు లేరని అన్నారు.

గత ఎన్నికల్లో విశాఖ నుంచి జగన్ తల్లి విజయలక్ష్మి పోటీ చేసినప్పుడు నగర ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. సుస్థిర పాలన అందించే పార్టీకే ప్రజలు ఓటేస్తారని చెప్పిన గంటా.. బీజేపీకి ఏపీలో అసలు ఓటు బ్యాంకే లేదన్నారు.

More Telugu News