Chandrababu: మోదీ అహంకారపూరిత వ్యాఖ్యలకు సమాధానాలు ఇవిగో.. ప్రధానికి చంద్రబాబు ఏడు పేజీల లేఖ

  • కర్నూలు సభలో చంద్రబాబుపై విరుచుకుపడిన ప్రధాని మోదీ
  • చంద్రబాబుకు తొమ్మిది ప్రశ్నలు
  • వాటికి సమాధానాలు చెబుతూ చంద్రబాబు బహిరంగ లేఖ

రెండు రోజుల క్రితం కర్నూలు బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించిన కొన్ని ప్రశ్నలు సంధించారు. అదే రోజు వాటిని తిప్పికొట్టిన చంద్రబాబు.. తాజగా మోదీకి ఏడు పేజల బహిరంగ లేఖను రాశారు. మోదీ తనకు సంధించిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం ఇదేనని పేర్కొన్నారు. మోదీ సంధించిన ఒక్కో ప్రశ్నకు దానికిందే జవాబును రాశారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆంధ్రుల అభిమానాన్ని దెబ్బతీసేలా ప్రధాని మాట్లాడారని లేఖలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రులు రగిలిపోతున్నారని, వారందరి తరపున తాను సమాధానం ఇస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.  చివరగా.. ఏపీ గురించి కనీస చరిత్ర కూడా తెలియకుండా కర్నూలులో మోదీ అడుగుపెట్టారంటూ ఎద్దేవా చేశారు. కర్నూలు వచ్చిన తొలి ప్రధానిని తానేనని చెప్పుకోవడం ఆయన అవగాహన రాహిత్యమని మండిపడ్డారు.

పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నేతను దేశానికి ప్రధానిని చేసింది కర్నూలు జిల్లాయేనని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రధాని హోదాలో రాయలసీమకు వచ్చిన మీరు ఆ ప్రాంతానికి ఏం మేలు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. మీలాంటి నాయకులు కర్నూలుకు రావడం మా దురదృష్టమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటలతో, చేతలతో ఆంధ్రులను క్షోభకు గురిచేస్తున్న మీరు ఆంధ్రుడి కోపానికి గురికాక తప్పదని చంద్రబాబు ఆ లేఖలో హెచ్చరించారు.

More Telugu News