Delhi Capitals: టీ-20 మజాను చూపుతూ 'సూపర్'గా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్!

  • ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • 185 పరుగుల వద్ద స్కోర్లు సమం
  • సూపర్ ఓవర్ లో 11 పరుగులు చేయలేకపోయిన నైట్ రైడర్స్

పొట్టి క్రికెట్ లో ఉన్న మజా ఏంటో మరోమారు తెలిసివచ్చింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్, సూపర్ ఓవర్ కు దారితీయగా, కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు 185 వద్ద సమానం కాగా, సూపర్ ఓవర్ లో 11 పరుగులు చేయాల్సిన నైట్ రైడర్స్ జట్టు 7 పరుగులకు పరిమితమైంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్ 28 బంతుల్లో 62 పరుగులతో రాణించగా, దినేశ్ కార్తీక్ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆపై 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా 55 బంతుల్లో 99 పరుగులు చేసి, కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. చివరి ఓవర్ కు 6 పరుగులు కావాల్సి వుండగా, ఐదు పరుగులు మాత్రమే రావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు.

సూపర్‌ ఓవర్ లో కోల్ కతా తరఫున ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌ వేయగా, ఢిల్లీ ఆటగాళ్లు 10 పరుగులు సాధించారు. ఢిల్లీ తరఫున రబడా బౌలింగ్ చేయగా, కోల్‌కతా 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

More Telugu News