Andhra Pradesh: చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం.. జగన్ గెలిస్తే ఇడుపులపాయకు రాజధాని!: సీపీఐ నేత కె.రామకృష్ణ

  • ఏపీలో జనసేన-సీపీఐ కూటమి అధికారంలోకి వస్తుంది
  • అవినీతి రహిత పాలన మా కూటమితోనే సాధ్యం
  • గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-సీపీఎం-సీపీఐ-బీఎస్పీ కూటమి అధికారంలోకి వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ  జోస్యం చెప్పారు. ఒకవేళ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే వైసీపీ అధినేత జగన్ ను గెలిపించారంటే రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళతారని హెచ్చరించారు.

ఏపీలో టీడీపీ, వైసీపీలు దొందూదొందేనని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు లోక్ సభ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిరహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News