Telangana: కాంగ్రెస్ కు 16 లోక్ సభ సీట్లు ఇవ్వండి.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తాడు!: పొన్నం ప్రభాకర్

  • 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడించాక ఫేస్ బుక్ పోస్టుకు స్పందించాడు
  • కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
  • కరీంనగర్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

ఓటు హక్కులేని పిల్లలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్ లో నిన్న నిర్వహించిన కేటీఆర్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని దుయ్యబట్టారు. కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించబోతున్నారని తెలియడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు సభలు ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా నగదును పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినోద్ కుమార్ గెలిస్తే మంత్రి అవుతారని ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలు వినోద్ ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారో చెప్పండి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో ఓడిపోయాక కేసీఆర్ ఒక్క ఫేస్ బుక్ పోస్టుకు స్పందించారనీ, ఈ లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే, సీఎం ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను స్థానికుడిననీ, వినోద్ కుమార్ స్థానికేతరుడని విమర్శించారు.

More Telugu News