Jagan: ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రాజశ్యామల యాగం.. నెల్లూరులో అత్యంత రహస్యంగా జరిగిన వైనం!

  • అధికారం కోసం కష్టపడుతున్న జగన్
  • పాల్గొన్న 27 మంది రిత్వికులు
  • కేసీఆర్ సలహాతో యాగం చేపట్టిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని భావిస్తున్నారు. మరో 20 రోజుల్లో అధికారంలోకి వస్తానని పదేపదే చెప్పుకుంటున్న జగన్..  సీఎం పీఠాన్ని అధిష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాజశ్యామల యాగం చేయించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో అత్యంత గోప్యంగా ఈ యాగం జరిగినట్టు ‘బెంగళూరు మిర్రర్’ ఆన్‌లైన్ ఎడిషన్ పేర్కొంది. జగన్ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ యాగంలో ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఒక్క ఎంపీ మాత్రమే పాల్గొన్నట్టు తెలిపింది.
 
రాజశ్యామల యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నట్టు బెంగళూరు మిర్రర్ పేర్కొంది. విశాఖ శారాదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలిపింది. అలాగే, జగన్‌కు బదులు ప్రధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని పూర్తి చేసినట్టు వివరించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ కూడా యాగం నిర్వహించారని తెలుస్తోందని ‘బెంగళూరు మిర్రర్’ పేర్కొంది.

More Telugu News