saiber crime: మీ బ్యాంక్‌ ఖాతాలో నగదు జాగ్రత్త... ఓటీపీ చెప్పకున్నా మాయమవుతుంది!

  • ఆన్‌లైన్‌ లావాదేవీలపై కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు
  • వివరాలు తెలుసుకుని నూతన వ్యాలెట్లతో మాయాజాలం
  • బ్యాంకు అధికారులకే టోకరా

బ్యాంకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కూడా కొత్త పంథాలను వెతుకుతున్నారు. ఇప్పటి వరకు మన ఖాతాలో నగదు ఉంటే ఓటీపీ వస్తుందిగా? అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఓటీపీతో సంబంధం లేకుండా నగదు తస్కరించే సరికొత్త వ్యాలెట్లతో మాయాజాలాన్ని మొదలుపెట్టారు సైబర్‌ నేరగాళ్లు. అందువల్ల  బ్యాంక్‌ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లావాదేవీలు నిర్వహించే వారు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తుండాలని, వివరాలు తస్కరణకు గురికాకుండా చూసుకోవాలని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.

నగదు దొంగిలించేందుకు సైబర్‌ నేరగాళ్లు తాజాగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు, ఈబే, పేటీఎం వ్యాలెట్లను వినియోగించుకుంటున్నారు. సాక్షాత్తు బ్యాంకు అధికారులకే వీరు టోకరా వేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో వ్యాలెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు చొప్పున బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధంగా హైదరాబాదీల నుంచి రూ.80 లక్షల వరకు దోచేశారని వెల్లడి కావడంతో బ్యాంకు అధికారులే నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఇందుకోసం సైబర్‌ నేరగాళ్లు డెబిట్‌ కార్డు ఇంటర్నెట్‌ లావాదేవీల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే వారి ఖాతా నుంచి నగదు తస్కరిస్తున్నారు. హైదరాబాద్‌ కోఠీలోని ఓ జాతీయ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ ఖాతా నుంచి ఇలా రూ.3.17 లక్షలు లాగేశారు. డబ్బు విత్‌డ్రా చేసిన సందర్భంగా నగదు తక్కువగా ఉండడంతో ఆయన ఖాతా పరిశీలించారు. ఐదు విడతల్లో తన ఖాతా నుంచి వేర్వేరు వ్యాలెట్లకు రూ.3.17 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు.

ఖాతాదారులు నగదు ఈ-బదిలీ చేసేటప్పుడు సొమ్ము వ్యాలెట్‌లోకి వెళ్లకుండా బ్యాంక్‌ ‘గేట్‌వే’ 24 గంటలపాటు ఆపుతుంది. ఈలోగా ఖాతాదారుడు తాను ఆ లావాదేవీ చేయలేదంటే బ్రేక్ వేస్తుంది.  దీంతో  సైబర్‌ నేరగాళ్లు తక్కువ మొత్తాన్ని గేట్‌వే వేగంగా రిలీజ్‌ చేయడాన్ని గుర్తించి రూ.5 వేలు, రూ.10 వేలు బదిలీ చేసి మోసాలకు ప్పాడుతున్నారని గుర్తించారు.

ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలను అనుమతించే డెబిట్‌ కార్డులపై ఉన్న టవర్‌ సింబల్‌ను  సంబంధిత బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ సాయంతో డీ ఆక్టివేట్‌ చేసుకోవాలని, అలా చేసుకోని ఖాతాదారులే ఎక్కువగా ఇటువంటి మోసం బారిలో పడుతున్నారని  బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

More Telugu News