Uttarakhand: సీనియర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడు!

  • బోర్డింగ్ స్కూలులో చదువుతున్న బాలుడు
  • స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన విద్యార్థి
  • బిస్కెట్లను దొంగిలించాడని ఫిర్యాదు
  • ప్రాంగణంలోనే పూడ్చిపెట్టిన యాజమాన్యం

బిస్కట్లు దొంగిలించాడని ఏడో తరగతి విద్యార్థిని సీనియర్లు క్రికెట్ బ్యాట్, వికెట్లతో తీవ్రంగా కొట్టి చంపారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ హత్యను దాచేందుకు పాఠశాల యాజమాన్యం బాలుడి మృతదేహాన్ని పాఠశాల ప్రాంగణంలోనే పూడ్చి పెట్టింది. ఈ నెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని హపూర్‌కు చెందిన ఓ బాలుడు రిషికేష్ సమీపంలోని బోర్డింగ్ స్కూలులో చదువుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన బాలుడు, ఓ దుకాణంలోని బిస్కట్లను దొంగిలించాడు. దీంతో ఆ దుకాణం యజమాని పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం, ఏ విద్యార్థి ఇకపై బయటకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. దీంతో బాలుడిపై కోపం పెంచుకున్న సీనియర్లు, ఈనెల 10న క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో బాలుడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ దాడి విషయాన్ని బయటకు పొక్కనీయకుండా బాలుడి మృతదేహాన్ని పాఠశాల ప్రాంగణంలో యాజమాన్యం పూడ్చి పెట్టింది. ఘటన గురించి తెలిసిన కొందరు, బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌కు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పాఠశాల మేనేజర్, పీఈటీ, వార్డెన్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News