Bollywood: వచ్చే నెల 6న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా.. ప్రకటించిన బీజేపీ రెబెల్ నేత శత్రుఘ్న సిన్హా!

  • ఢిల్లీలో ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ
  • రాజకీయ పరిస్థితి, భవిష్యత్ పై చర్చ
  • బీజేపీకి ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్య

బీజేపీ రెబెల్ నేత, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈరోజు ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో రాజకీయ పరిస్థితి, బిహార్ లో పార్టీ పటిష్టతపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిన్హా ఆసక్తి చూపగా, రాహుల్ గాంధీ స్వాగతించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 6న తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

దేశాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) నిజంగా పేదరికంపై మాస్టర్ స్ట్రోక్ అని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా బిహార్ లోని పట్నాసాహిబ్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొన్నేళ్లుగా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం ఆయన్ను ఇప్పటివరకూ సస్పెండ్ చేయలేదు.

More Telugu News