america: ఇక అమెరికా వంతు... మసూద్‌ను టార్గెట్‌ చేసిన అగ్రరాజ్యం!

  • బ్లాక్‌ లిస్టులో చేర్చేందుకు తీర్మానం
  • ఇప్పటికే ప్రాన్స్‌ నిర్ణయాత్మక చర్యలు
  • పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాది చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పాకిస్థాన్‌ అండతో, వారి సంరక్షణలో ఆశ్రయం పొందుతూ భారత్‌పై ఉగ్ర యుద్ధం చేస్తున్న జైషేమహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మొన్న ప్రాన్స్‌, తాజాగా అమెరికా మసూద్‌ను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపడుతున్నాయి. మసూద్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని అమెరికా చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రాన్స్‌ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి తన దేశంలోని అతని ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ యూనియన్ లోని మిగిలిన దేశాలను ఒప్పించేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా, మసూద్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చేందుకు అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్యదేశాలైన బ్రిటన్‌, ప్రాన్స్‌తో కలిసి సరికొత్త తీర్మానాన్ని తయారు చేసి 15 సభ్యల దేశాలకు అందజేసింది.

ఈ తీర్మానంలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది. ‘ఈ జైషే నేతకు ఆల్‌ఖైదా, ఐసిస్‌ వంటి ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఆయా సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, వారి దాడులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలపడం వంటివి చేశారు. అందువల్ల చర్యలు తీసుకోవడం తప్పనిసరి’ అంటూ ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

రెండు వారాల క్రితం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ విజ్ఞప్తి మేరకు భద్రతా మండలి తీర్మానం చేస్తే వీటో అధికారం ఉన్న చైనా అడ్డుకుంది. తాజాగా అమెరికా చేసిన ప్రతిపాదనపై డ్రాగన్‌ కంట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News