Balakrishna: మరోమారు రెచ్చిపోయిన బాలయ్య.. నరికి పోగులు పెడతానంటూ వీడియో జర్నలిస్టు‌పై చేయిచేసుకున్న వైనం!

  • ప్రచారంలో బాలయ్య కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన చిన్నారులు 
  • పక్కకు లాక్కెళ్లిన భద్రతా సిబ్బంది
  • వీడియో తీసిన చానల్ ప్రతినిధిపై బాలయ్య చిందులు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. ఓ వీడియో జర్నలిస్టును నరికి పోగులు పెడతానంటూ హెచ్చరించారు. హిందూపురం ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నా ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య కాన్వాయ్‌కు కొందరు చిన్నారులు అడ్డుగా వచ్చారు. దీనిని గమనించిన బాలకృష్ణ భద్రతా సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారు. దీనిని ఓ న్యూస్ చానల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ షూట్ చేశాడు. అది చూసిన బాలయ్య ఆగ్రహంతో అతడి వద్దకు వచ్చి షూట్ చేసిన దానిని డిలీట్ చేయాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘‘నరికి పోగులు పెడతా, ప్రాణాలు తీస్తా. బాంబులు వేయడం, కత్తి తిప్పడం నాక్కూడా తెలుసు’’ అని హెచ్చరిస్తూ చేయి చేసుకున్నారు. దీంతో వీడియో జర్నలిస్ట్ వణికిపోయాడు.

వీడియో జర్నలిస్టుపై బాలయ్య చిందులు వేస్తున్న దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. వీడియో జర్నలిస్టుపై బాలకృష్ణ చేయి చేసుకోవడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News