Telangana: వాళ్లతో పాటు వైఎస్ జగన్ కూడా మనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • కాంగ్రెస్, బీజేపీ అంటే పడని 15 పార్టీలున్నాయి
  • కారు-సారు-పదహారు నినాదంతో ఓటేయండి
  • సిరిసిల్ల ముస్తాబాద్ లో కేటీఆర్ పిలుపు

తెలంగాణ ప్రజలు 16 లోక్ సభ స్థానాలను కట్టబెడితే జాతీయ స్థాయిలో మరో 150 సీట్లు కలిసివస్తాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పొడగిట్టని దాదాపు 15 పార్టీలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యూపీలో మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ కు, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే బీజేపీకే లాభమనీ, అదే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణ గడ్డకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే మంచిదని భావించిన ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ‘మనం ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిస్తే, మనకు దన్నుగా నిలిచే పార్టీలతో కలిసి కేంద్రం మెడలు వంచవచ్చు. మన రాష్ట్ర ప్రాజెక్టులకు 90 శాతం వరకూ నిధులు తెచ్చుకోవచ్చు. మిషన్‌ భగీరథ వంటి వాటికి నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది.

రూ.24,000 కోట్లు ఇవ్వాలని సూచిస్తే కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చలేదు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్‌ రావాలని ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అదే ఢిల్లీలో మన బలం ఉంటే రెండేళ్లలో ఈ మార్గంలో రైలు కూత పెట్టేలా చేయొచ్చు. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌.. 16 మందితో ఏం చేస్తారో ఆలోచించండి’ అని కోరారు. ప్రజలంతా సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. ఈ నినాదంతో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News