Andhra Pradesh: ఏపీ మంత్రి నారాయణకు ఝలక్.. వైసీపీలో చేరిన తోడల్లుడు రామ్మోహన్!

  • టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే వైసీపీలో చేరా
  • నారాయణ డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు
  • ఆదాల, అనిల్ సమక్షంలో వైసీపీ తీర్థం

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన తోడల్లుడు రామ్మోహన్ వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనిల్ కుమార్ ల సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ కు  కండువా కప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే తాను వైసీపీలో చేరానని తెలిపారు. నెల్లూరు జిల్లాను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవేళ నిజంగానే నెల్లూరును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు డబ్బులు పెట్టి ఓట్లను ఎందుకు కొంటున్నారని నిలదీశారు. మరోవైపు రామ్మోహన్ రాకతో జిల్లాలో వైసీపీ మరింత బలపడుతుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చకే చాలామంది టీడీపీ వీడుతున్నారని తెలిపారు.

More Telugu News