Chandrababu: జగన్! నీకు సిగ్గులేకపోయినా మాకుంది.. కేసీఆర్ కాళ్ల దగ్గరే ఉండి ఊడిగం చేసుకో!: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు ఆగ్రహం

  • కేసీఆర్ ను ప్రశ్నించకుండా కాళ్లమీదపడ్డాడు
  • ప్రత్యేకహోదా కోసం కాదు ప్రత్యేక సాయం కోసం!
  • జగన్, కేసీఆర్ లపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం

కర్నూలు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఓవైపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మూసివేయాలని, ముచ్చుమర్రి మూసేయాలని అంటాడని, ట్రైబ్యునల్ కూడా వేస్తాడని, అలాంటప్పుడు ఆంధ్రుడైన జగన్ ఏం చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రశ్నించాల్సింది పోయి ఆయన కాళ్ల దగ్గర ఊడిగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కాల్మొక్తా బాంచన్ అంటూ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు.

"ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ కు మద్దతు ఇస్తానని జగన్ అంటాడు. అది ప్రత్యేక హోదా కోసం కాదు, ప్రత్యేక సాయం కోసం. కేసీఆర్ ఇచ్చే వెయ్యో, రెండువేల కోట్ల కోసమో కక్కుర్తిపడ్డాడు. ఈయన జీవితం అవినీతిమయం. ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది. అందుకే బాంచన్ నీ కాల్మొక్తా అంటూ కేసీఆర్ కాళ్ల దగ్గర పడున్నాడు. నువ్వలాగే పడుండు! ఊడిగం చెయ్! మాకేం అభ్యంతరంలేదు. కానీ మా హక్కులకు అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టేదిలేదు. ఖబడ్దార్ జగన్ మోహన్ రెడ్డీ! నీకు సిగ్గులేకపోయినా మాకుంది" అంటూ విరుచుకుపడ్డారు.

అంతేకాదు, కేసీఆర్ పైనా ఓ స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సోనియా తెలంగాణ వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేకహోదాపై మాట్లాడితే కేసీఆర్ అభ్యంతరం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పేచీ పెట్టాడని ఆరోపించారు. "ఆదాయం నీకే కావాలి, ప్రత్యేక హోదా కూడా కావాలి. మేం సంపాదించిందంతా నువ్వే తీసుకున్నావు. మమ్మల్ని అడుగడుగునా అవమానిస్తావా? మేం వెళితే ఆంధ్రావాళ్ల పెత్తనం అంటావా? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? నువ్వు ఒక్కటిస్తే నేను 100 గిఫ్టులిస్తా" అంటూ మండిపడ్డారు.

ఇక ప్రత్యేక కోడికత్తి అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్లకు ఈయన సపోర్ట్ చేస్తాడంట! బీజేపీ వాళ్లు తప్ప దేశంలో అన్ని పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ కోడికత్తి పార్టీ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎందుకీ దొంగమాటలు?" అంటూ ప్రశ్నించారు.

More Telugu News