murali manohar joshi: ఇక నన్ను పోటీ చేయద్దన్నారు: ఓటర్లకు మురళీ మనోహర్ జోషి లేఖ

  • సీనియర్ నేతగా ఎంతో అనుభవం 
  • ఎన్నికలకి దూరంగా వుండాలంటూ ఆదేశాలు 
  • అసంతృప్తిని వ్యక్తం చేసిన మురళీ మనోహర్ జోషీ   

ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ .. బీజేపీలో సీట్ల పరంగా చకచకా మార్పులు, చేర్పులు  జరిగిపోతున్నాయి. అయితే కొంతమంది సీనియర్ నేతలు తమ విషయంలో జరిగిన మార్పుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మురళీమనోహర్ జోషీ కూడా అదే పనిలో వున్నారు. బీజేపీలో ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మురళీమనోహర్ జోషీ ఎన్నో సేవలను అందించారు. అలాంటి ఆయనకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆవేదన చెందిన ఆయన తన నియోజకవర్గమైన కాన్పూర్ ఓటర్లను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

"ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు .. రానున్న ఎన్నికలలో కాన్పూర్ నుంచే కాకుండా మరెక్కడి నుంచీ పోటీ చేయవద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ ఈ రోజు నన్ను కోరారు. ఈ ఎన్నికలలో నన్ను పోటీకి దూరంగా ఉంచాలనేది పార్టీ నిర్ణయమని అన్నారు" అంటూ జోషి ఆ లేఖలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, ఈ లేఖపై మురళీమనోహర్ జోషీ సంతకం లేకపోయినా, ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించినట్టు ఓ ఆంగ్ల మీడియా చెప్పుకొచ్చింది. పార్టీ నిర్ణయం ఏదైనా అది నేరుగా పార్టీ అధ్యక్షుడు తనతో చెబితే బాగుండేది ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం. ఒక వైపున గాంధీనగర్ నియోజక వర్గం నుంచి తప్పించినందుకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ నొచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మురళీమనోహర్ జోషి విషయంలో కూడా పార్టీ అదే విధంగా వ్యవహరించడం ఆయనకి కూడా అసంతృప్తిని కలిగించినట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News