Vijayasai Reddy: చంద్రబాబూ... ఈ ఒక్కటన్నా ధైర్యంగా చెప్పొచ్చుగా?: విజయసాయిరెడ్డి

  • మా పథకాలను కాపీ కొడుతున్నారు
  • ఇప్పటికే నవరత్నాల కాపీ పేస్ట్
  • సొంత మేనిఫెస్టో ప్రకటించలేని బాబు
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి విమర్శలు

ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హామీలనైతే ఇచ్చిందో, చంద్రబాబు వాటినే కాపీ కొడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. "వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత దాన్ని కాపీ కొట్టి తెలుగుదేశం హామీలు వెల్లడిస్తాం అని ధైర్యంగా చెప్పొచ్చు కదా చంద్రబాబు గారూ. ఇప్పటికే నవరత్నాలను కాపీ పేస్ట్ చేశారు. పక్క రాష్ట్రం పథకాలను ఎత్తేశారు. సొంత మేనిఫెస్టో ప్రకటించలేని దయనీయ స్థితి ఏమిటి బాబూ?" అని ఆయన కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.

ఆపై "జనసేనతో లోపాయికారి పొత్తు వల్ల ప్రయోజనం లేదని అర్థమైంది. పార్టనర్ల దొంగాటను ప్రజలు గ్రహించడంతో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ఏకపక్షంగా ఉండబోతోంది. భారీ ఓటమి నుంచి తప్పించుకోలేరు. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని ఓ ట్వీట్, "రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ 20 వాహనాల కాన్వాయ్ తో వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి ఎలక్షన్ అధికారులు ఏం చేస్తున్నట్టు? అన్ని వాహనాలకు అనుమతి ఎలా ఇస్తారు? ఇవ్వక పోతే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయాలి" అని మరో ట్వీట్ పెట్టారు.







More Telugu News