Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ 'మన్కడింగ్'పై మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్!

  • జోన్ బట్లర్ ను 'మన్కడింగ్' చేసిన అశ్విన్
  • గెలుపుకోసం దిగజారాడంటున్న ఫ్యాన్స్
  • ఇలా చేస్తాడని అనుకోలేదన్న మైఖేల్ వాన్

నిన్న జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో జోస్ బట్లర్ ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసిన విధానంపై యావత్‌ క్రికెట్‌ లోకం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అశ్విన్ తొండాట ఆడాడని, చేయకూడని పని చేశాడని, అలా చేసే ముందు ఓ మారు హెచ్చరించి వుంటే బాగుండేదని మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు అంటున్నారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించినా, ఆ విజయం తొండి ఆటతోనే సాధ్యమైందని కామెంట్లు చేస్తున్నారు.

13వ ఓవర్ ను వేసిన అశ్విన్ అప్పటికే ధాటిగా పరుగులు చేస్తూ, తన జట్టును విజయతీరాల వైపు నడిపిస్తున్న బట్లర్ ను 'మన్కడింగ్' చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ బంతిని వేయబోయే సమయానికి బట్లర్ క్రీజును దాటి బయటకు రాగా, బాల్ వేయని అశ్విన్, బెయిల్స్ ను పడదోసి అపీల్ చేశాడు. థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో బట్లర్ ఆగ్రహంతో మైదానాన్ని వీడాడు.

నిబంధనల ప్రకారం ఇది అవుటే అయినప్పటికీ, ఎంతో మంచి మనిషిగా పేరున్న అశ్విన్, ఎలాగైనా వికెట్‌ తీయాలన్న ఆలోచనలో 'మన్కడింగ్' చేశాడంటే నమ్మలేకున్నామని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. బట్లర్‌ క్రీజ్‌ దాటేవరకు వేచి చూడాలన్న ఉద్దేశం అశ్విన్ లో కనిపించిందని, క్రీడా స్ఫూర్తికి ఇది మాయని మచ్చని అంటున్నారు. కొందరు ఫ్యాన్స్ అశ్విన్‌ తెలివిని ప్రశంసిస్తున్నప్పటికీ, ఎక్కువ మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను చూసిన విషయాన్ని నమ్మలేకున్నానని, ఈ విషయంలో అశ్విన్ పశ్చాతాప పడతాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించారు. అశ్విన్ ఇలా చేస్తాడని అసలు ఊహింలేదని మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నారు. 

More Telugu News