KTR: దిగిపోయే టైమొచ్చేసరికి దిక్కుమాలిన పథకాలు పెడుతున్నారు: చంద్రబాబుకి కేటీఆర్ చురక

  • రైతులకు మేలు చేస్తున్నట్టు నటిస్తున్న బాబు
  • రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారని విమర్శలు
  • రాహుల్, మోదీ పొత్తు పెట్టుకున్నా అధికారం దక్కదన్న కేటీఆర్

తాను దిగిపోతానన్న భయంతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, చివరి రోజుల్లో దిక్కుమాలిన పథకాలు పెడుతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు తానేదో మేలు చేస్తున్నట్టు చంద్రబాబు నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణ రైతుల కోసం తాము రైతుబంధు పథకాన్ని తెస్తే, దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు.

తమ సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు కూడా అందుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలు పొత్తు పెట్టుకున్నా కేంద్రంలో అధికారం దక్కబోదని అంచనా వేసిన కేటీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ, యూపీలో అఖిలేష్, ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్... ఇలా ప్రాంతీయ పార్టీల నేతలే హవా కొనసాగిస్తున్నారని అన్నారు.

More Telugu News