Kurnool District: ఆదోని ప్రభుత్వాసుపత్రి వద్ద వైసీపీ సభ.. రోగుల వాహనాలు వెళ్లకుండా గేటుకు భారీ బ్యానర్

  • ఆసుపత్రి ప్రధాన గేటుకు భారీ బ్యానర్
  • లోపలికి వెళ్లలేకపోయిన అంబులెన్సులు
  • రోగులకు ప్రాణ సంకటం

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచార సభ రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ఆసుపత్రి లోపలికి రోగులు, అంబులెన్సులు వెళ్లకుండా ప్రధాన గేటుకు భారీ బ్యానర్ కట్టేశారు. దీంతో ఆసుపత్రి లోపలికి వెళ్లలేక రోగులు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సులను ప్రధాన గేటుకు చాలా దూరంలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వైసీపీ ప్రచార సభ ముగిసిన తర్వాత కూడా బ్యానర్‌ను తొలగించకుండా అలాగే ఉంచేశారు.

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యానర్ అలాగే ఉండడంతో కొందరు ఈ విషయాన్ని విషయం డీఎస్పీ వెంకట్రాముడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ భారీ బ్యానర్‌ను తొలగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఆసుపత్రి గేటుకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.

More Telugu News