Jana sena: టీడీపీలో చేరిన రామచంద్రపురం జనసేన నేత, వందలాదిమంది కార్యకర్తలు

  • ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో చేరిక
  • రామచంద్రపురం టికెట్ ఆశించి భంగపడిన శ్రీనివాసరావు
  • పార్టీని అందుకే వీడానంటూ కారణం చెప్పిన నేత

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం టికెట్ ఆశించి భంగపడిన జనసేన నాయకుడు దూడల శ్రీనివాసరావు సహా వివిధ మండలాలకు చెందిన వందలాదిమంది జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరారు. ద్రాక్షారామంలోని సాయి మాధవానంద కల్యాణ మండపంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో వీరంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నాయకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కమిటీలు ఏర్పాటు చేస్తానన్నారు. దూడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు సమర్థుడైన నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు.

 స్థానిక నియోజకవర్గంపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తికి జనసేన టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని బాండు రాసివ్వాల్సిందిగా ఆ అభ్యర్థిని కోరానని, అందుకు ఆయన ససేమిరా అనడంతోనే పార్టీని వీడినట్టు శ్రీనివాసరావు తెలిపారు.

More Telugu News