Andhra Pradesh: లోకేశ్ బాబు సత్తా అదీ!: షర్మిళకు బాబూ రాజేంద్రప్రసాద్ ఘాటు కౌంటర్

  • ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కు 57 అవార్డులు వచ్చాయి
  • మరి, కేటీఆర్ కు ఎన్ని అవార్డులొచ్చాయి?  
  • ఎవరు సమర్థులో అర్థం కావట్లేదా?

తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు ఐటీ శాఖా మంత్రి పదవి ఇచ్చారని చెప్పి, ఏపీలో చంద్రబాబు కూడా లోకేశ్ కు అదే పదవి ఇచ్చారంటూ వైసీపీ నాయకురాలు షర్మిళ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్ కు సత్తా ఉందని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆ పదవిని ఆయనకు ఇచ్చారని అన్నారు.

ఐటీ శాఖా మంత్రిగా ఉన్న లోకేశ్ కు జాతీయంగా, అంతర్జాతీయంగా 57 అవార్డులు వచ్చాయని, మరి, కేటీఆర్ కు ఎన్ని అవార్డులొచ్చాయో షర్మిళ చెప్పాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను లోకేశ్ చేపట్టిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 106 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా కేటీఆర్ కూడా చేశారుగా, మరి, ఆయనకు ఎన్ని అవార్డులొచ్చాయి? అని షర్మిళకు సూటి ప్రశ్న వేశారు.

‘ఎవరు సమర్థులో అర్థం కావట్లేదా? లోకేశ్ కు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కాదు అవన్నీ, కేంద్రం ఇచ్చింది. మీ ముసుగు మిత్రుడు, పార్టనర్, మీ ఫైనాన్షియర్ ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఇవి. అది, లోకేశ్ బాబు సత్తా’ అని షర్మిళకు ఘాటుగా బదులిచ్చారు.

More Telugu News