TRS: ‘జై తెలంగాణ’ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్టిచ్చారు: కేసీఆర్ కు వివేక్ లేఖ

  • కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు నాపై ఆరోపణలు చేశారు
  • తెలంగాణ మేలు కోసమే టీఆర్ఎస్ లోకి వచ్చా
  • ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు టికెట్లిచ్చారు

టీఆర్ఎస్ తరపున పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి అవకాశం దక్కని గడ్డం వివేక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఓ పథకం ప్రకారమే తనకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు తనపై తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టి ఎవరు ద్రోహం చేశారో తేలిపోయిందని విమర్శించారు. తన తండ్రి, తాను ‘తెలంగాణ’ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని, తెలంగాణ మేలు కోసం కేసీఆర్ ఆహ్వానిస్తేనే టీఆర్ఎస్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం ‘జై తెలంగాణ’ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్టిచ్చారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తూనే ఉంటానని, కష్ట కాలంలో తనకు తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ లేఖలో వివేక్ పేర్కొన్నారు. 

More Telugu News