Andhra Pradesh: రోజా ఇంట్లో ఏడు కార్లు!.. అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే!

  • తన పేరుపై రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడి
  • ఇందులో స్థిరాస్తులు 4.64 కోట్లు 
  • ఇద్దరు పిల్లల పేరుపై రూ.50 లక్షల డిపాజిట్లు

ఆంధ్రప్రదేశ్ లోని నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా మరోసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22న రోజా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా అందులోని వివరాలు బయటకు వచ్చాయి. తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో రోజా తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4,64,20,669 కాగా, చరాస్తుల విలువ రూ.రూ. 2,74,17,761గా ఉందని వెల్లడించారు. అలాగే తన పేరుపై రూ.49,85,026 అప్పు ఉందని పేర్కొన్నారు.

కుమార్తె అన్షు, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరిట రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో రోజా తెలిపారు. అలాగే తన దగ్గర కోటి రూపాయల విలువ చేసే మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నాయన్నారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు రూ.52,63,291 చెల్లించామన్నారు. అలాగే తన భర్త సెల్వమణి పేరుపై ఎలాంటి స్థిరాస్తులు లేవనీ, రూ.58 లక్షల విలువైన చరాస్తులు మాత్రం ఉన్నాయని వెల్లడించారు. అలాగే సెల్వమణి పేరుపై మరో రూ.22 లక్షల అప్పు ఉందన్నారు.

More Telugu News