Andhra Pradesh: చిత్తూరులో పల్టీకొట్టిన ప్రచారరథం.. పదో తరగతి పరీక్షలకు వెళుతూ ఇద్దరు విద్యార్థుల మృతి!

  • వేగంగా వెళుతూ పల్టీకొట్టిన ఓ పార్టీ కారు
  • ఆరుగురు విద్యార్థులకు గాయాలు
  • ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఓ పార్టీకి చెందిన కారులో విద్యార్థులు వెళుతుండగా, వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

జిల్లాలోని పెదమండ్యం మండలానికి చెందిన విద్యార్థులు ఈరోజు పదో తరగతి పరీక్షలు రాసేందుకు బయలుదేరారు. వీరిని ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచారరథం ఎక్కించుకుంది. మార్గమధ్యంలో కలిచెర్ల వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీనివాస్, రామ్మోహన్ అనే బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News