Gavireddy family: గవిరెడ్డి కుటుంబం తీరే వేరు.. అన్నో పార్టీ, తమ్ముడో పార్టీ, అక్కో పార్టీ!

  • మూడు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గవిరెడ్డి కుటుంబం
  • వైసీపీలో చేరిన సోదరి, సినీనటి రమ్యశ్రీ
  • అన్న సన్యాసినాయుడు జనసేన
  • తమ్ముడు రామానాయుడు టీడీపీ

విశాఖపట్టణం జిల్లా చీడికాడ మండలంలోని అప్పలరాజపురానికి చెందిన గవిరెడ్డి దేముడుబాబు కుటుంబం తీరే వేరు. ఏపీలో ప్రస్తుత రాజకీయం వేడెక్కిన తరుణంలో ఈయన కుటుంబం గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో హోరాహోరీగా తలపడుతున్న మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ, జనసేనలకు ఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం.

దేముడుబాబుకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. దేముడు బాబు కుమార్తె సుజాత అలియాస్ రమ్యశ్రీ సినీ నటి. పలు సినిమాల్లో నటించారు. తన పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

రమ్యశ్రీ సోదరుడు సన్యాసినాయుడు జీఎస్ఎన్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో దివంగత నేత హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈసారి టికెట్ ఆశించిన ఆయనకు జగన్ మొండిచేయి చూపడంతో జనసేనలో చేరి మాడుగుల టికెట్ సంపాదించారు.
 
రమ్యశ్రీ మరో సోదరుడు రామానాయుడు 2009లో మాడుగుల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందినవారు మూడు ప్రధాన పార్టీల్లో ఉండడం నిజంగా విశేషమే.

More Telugu News