Hyderabad: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి పట్టుబడిన రూ.కోటిన్నర.. ఎన్నికల వేళ కలకలం

  • పెద్దమ్మగుడి సమీపంలో యాక్టివాపై తరలిస్తుండగా పట్టివేత
  • పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
  • ఓ రియల్టర్ ఇచ్చినట్టు గుర్తింపు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో కోటిన్నర రూపాయల మొత్తం లభ్యమైంది. పెద్దమ్మ గుడి సమీపంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో యాక్టివా స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో తరలిస్తున్న ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో తరలిస్తున్న ఈ సొమ్ముకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ సొమ్మును సీజ్ చేశారు.

యాక్టివాపై వెళ్తున్న వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆపి తనిఖీ చేసినట్టు పోలీసులు తెలిపారు. సొమ్ము తరలిస్తున్న వ్యక్తులను అడిక్‌మెట్‌కు చెందిన గోపీనాథ్ (47), అతడి బంధువైన రాఘవేందర్ (32)గా గుర్తించినట్టు పేర్కొన్నారు. గోపీనాథ్ అకౌంటెంట్‌గా , రాఘవేందర్  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేశ్ ఇచ్చిన రూ.1.49 కోట్లను వారిద్దరూ అడిక్‌మెట్‌కు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం సీజ్ చేసిన నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్టు తెలిపారు. ఎన్నికల వేళ కోటిన్నర రూపాయల సొమ్ము పట్టుబడడం నగరంలో చర్చనీయాంశమైంది.

More Telugu News