India: పుల్వామా దాడి జరిగినప్పుడు మోదీ ఏం చేశారు.. బీఫ్ బిరియానీ తిని పడుకున్నారా?: ఒవైసీ ఘాటు విమర్శలు

  • బాలకోట్ లో 250 మంది ఉగ్రవాదులను చంపారు
  • 300 సెల్ ఫోన్లను ట్యాప్ చేశామని హోంమంత్రి అన్నారు
  • మరి 50 కేజీల ఆర్డీఎక్స్ తీసుకొచ్చిన ఉగ్రవాది కనిపించలేదా?

మజ్లిస్ పార్టీ అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరిద్దరూ బీఫ్ తిని పడుకున్నారా? అని నిలదీశారు.

హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసద్ మాట్లాడుతూ.. ‘భారత వాయు సేన(ఐఏఎఫ్) పాక్ లోని బాల్‌కోట్‌ లో ఉన్న ఉగ్రస్థావరాలపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటున్నారు. మరోవైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం ఉగ్రవాదులకు సంబంధించిన 300 ఫోన్లను ట్యాప్‌ చేశామంటారు. బాలకోట్‌లో 300 ఫోన్లు కనిపించిన మీకు.. ఓ ఉగ్రవాది 50 కేజీల ఆర్డీఎక్స్‌ను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు?  బీఫ్‌ బిర్యాని తిని పడుకున్నారా?’ అని ఎద్దేవా చేశారు.

లౌకికవాదం, సోదర భావాన్ని అంతం చేయాలనుకునే వారిపైనే తన పోరాటమని స్పష్టం చేశారు. ‘ఎవరినైనా జాతీయ పార్టీలు ఎన్నని అడిగితే రెండు లేదా మూడు అని చెబుతారు. కానీ నేను మాత్రం ఒక్కటే జాతీయపార్టీ ఉందని, అది బీజేపీ అని అంటాను. ఎందుకంటే కాంగ్రెస్‌ కూడా 1.5 బీజేపీనే. ఈ రెండు పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం లేదు. రెండూ ఒకటే’ అని తెలిపారు. పుల్వామా ఉ‍గ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

More Telugu News