Anchor Shyamala: ‘మా’ ఎన్నికల్లో ఓడిన శివాజీ రాజాకు యాంకర్ శ్యామల కంగ్రాట్స్.. తాను ఓడానన్నా వినిపించుకోని యాంకర్!

  • ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన శివాజీ రాజా
  • శ్యామల వ్యాఖ్యలతో ప్రేక్షకులు షాక్
  • సోషల్ మీడియాలో సెటైర్లు

హైదరాబాద్‌లో నిన్న రాత్రి నిర్వహించిన ‘సూర్యకాంతం’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాంకర్ శ్యామల చేసిన అతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమైంది. నిహారిక, రాహుల్ విజయ్ జోడీగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామల అత్యుత్సాహం ప్రదర్శించి అతి చేయడంతో ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఇక ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా అయితే తెల్లమొహం వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైటిల్ కాన్సెప్ట్‌లో భాగంగా ‘మీ జీవితంలో మీరు చూసిన సూర్యకాంతం ఎవరు’? అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను శ్యామల ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.  

అలా అందరినీ అడుగుతూ శివాజీ రాజా వద్దకు వచ్చిన శ్యామల.. మా ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ మొదలుపెట్టింది. ఆమె వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు.. ‘మీరు గెలిచిన తర్వాత ఇదే మొదటి ఫంక్షన్ అనుకుంటా’ అనడంతో శివాజీ రాజాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించిన శివాజీ రాజా.. ‘గెలిచింది నేను కాదు తల్లీ.. నేను ఓడిపోయా. నా టీంలో మాత్రం కొందరు గెలిచారు’ అని ఇబ్బంది పడుతూ చెప్పారు. అయినప్పటికీ పట్టించుకోని శ్యామల.. ‘మీ టీంలో వారు గెలిస్తే మీరు గెలిచినట్టే’ అంటూ తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టింది. ఓడిన శివాజీ రాజాకి కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా.. మీరు గెలిచినట్టే.. అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఉండి కూడా మరీ ఇంత అవగాహన రాహిత్యమా? అని శ్యామలపై మండిపడుతున్నారు.

More Telugu News