Cricket: తుస్సుమన్న కోహ్లీ... 70 పరుగులకే కుప్పకూలిన రాయల్ చాలెంజర్స్

  • టాప్ స్కోరర్ పార్థివ్ (29)
  • రాణించిన సూపర్ కింగ్స్ బౌలర్లు
  • హర్భజన్, తాహిర్ సూపర్ బౌలింగ్

ఎన్నో అంచనాలతో ఐపీఎల్ -12 సీజన్ ను ఘనంగా ఆరంభించాలని భావించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని బౌలింగ్ దాడి ఎదురైంది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బెంగళూరు జట్టును ఆరంభంలో చావుదెబ్బ తీయగా, మిడిల్ ఓవర్లలో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చెలరేగిపోయాడు.

చెన్నై వేదికగా జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటైంది. 29 పరుగులు చేసిన పార్థివ్ పటేల్ ఆ జట్టులో టాప్ స్కోరర్. కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసి హర్భజన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అక్కడ్నించి ఆరంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు.

ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు విసిరిన భజ్జీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తాహిర్ ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు 2 వికెట్లు దక్కాయి. బెంగళూరు జట్టులో పార్థివ్ తప్ప మరెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. అనంతరం లక్ష్యఛేదన ఆరంభించిన చెన్నై 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.

More Telugu News