Vijayawada: ఏ అర్హతతో టీడీపీని మళ్లీ గెలిపించాలి?: చంద్రబాబుకు పవన్ సూటి ప్రశ్న

  • చంద్రబాబు మాట్లాడితే ‘విశ్వనగరం’ అంటారు
  • డంపింగ్ యార్డు సమస్య అలానే ఉంది
  • గూండాయిజం లేకుండా చేస్తా

త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరుతున్నారని, ఏ అర్హతతో ఆ పార్టీని గెలిపించాలో ఆయన సమాధానం చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మాట్లాడితే ‘విశ్వనగరం’ అంటారని, పక్కనే ఉన్న అజిత్ సింగ్ నగర్ లో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. చంద్రబాబుకు, లోకేశ్ కు ఈ సమస్య పట్టదని విమర్శించారు.

ఏపీలో గూండాయిజం లేకుండా ఉండాలంటే యువత బయటకు రావాలని పిలుపు నిచ్చారు. యువత బయటకు రావాలంటే.. గూండాలతో గొడవలు పెట్టుకోమని కాదని పవన్ అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక, యువత కోసం స్పెషల్ పోలీస్ కమాండర్స్ గా 25 వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతి పాసై ఉంటేచాలని, ఆరు నెలలు ట్రైనింగ్ ఇప్పించి  స్పెషల్ పోలీస్ కమాండర్ గా శిక్షణ ఇప్పిస్తామని, ఎవరైతే గూండాయిజం చేస్తారో వారి తాట తీస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఎవరు భూకబ్జాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News