YSRCP: పవన్ కల్యాణ్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి: వైసీపీ నేత బొత్స

  • పవన్ కల్యాణ్ లా రోజుకో మాట మాట్లాడలేము
  • ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దు
  • టీఆర్ఎస్ తో కుమ్మక్కైంది ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లా రోజుకో మాట తాము మాట్లాడలేమని, ఊసరవెల్లిలా మారలేమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య,  ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

నిన్న భీమవరం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంది ఎవరు? ఆ పార్టీతో కుమ్మక్కైంది ఎవరు? అని ప్రశ్నించిన బొత్స, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పవన్ సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానని, ఆ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని ఆ ట్వీట్ లో నాగబాబు పేర్కొన్నట్టు బొత్స చెప్పారు. దీనిని బట్టి టీఆర్ఎస్ తో ఎవరు కుమ్మక్కయ్యారో తెలియడం లేదా? అని ప్రశ్నించారు.

More Telugu News