Pawan Kalyan: నన్ను ఇబ్బంది పెట్టిన అధికారికి చంద్రబాబు తన పార్ట్‌నర్ ద్వారా విశాఖ టికెట్ ఇప్పించారు!: జగన్

  • చంద్రబాబు, లక్ష్మీనారాయణపై జగన్ నిప్పులు
  • పవన్ నామినేషన్‌లో టీడీపీ జెండాలు
  • చంద్రబాబు స్క్రిప్ట్‌తోనే పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు

తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన అధికారికి చంద్రబాబు భీమిలి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నించారని వైసీపీ అధినేత జగన్ పరోక్షంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులివెందులలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు చర్చి వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కలిసి తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని, కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. సీబీఐలో పనిచేసిన ఓ అధికారితో కలిసి తనను ఇబ్బంది పెట్టాలని చూశారని జగన్ ఆరోపించారు.

ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసని, ఆయనకు తొలుత భీమిలి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారని, అయితే, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి తన పార్ట్‌నర్ (పవన్) ద్వారా విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించి డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పార్ట్‌నర్ (పవన్) నామినేషన్ వేసిన రోజు అక్కడ టీడీపీ జెండాలు కనిపించాయన్నారు. చంద్రబాబు పార్ట్‌నర్ ఎవరో తెలుసా? అని ప్రశ్నించిన జగన్.. ఆయన ఓ సినీ నటుడని పేర్కొన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్, ఆదేశాలతో ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రామాల్లో పంచుతున్న డబ్బును తమ నవరత్నాల పథకంతో కొట్టిపడేస్తామని, వచ్చేది మన ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు.  

More Telugu News