Chandrababu: చంద్రబాబుకి స్వయంగా లేఖలు రాశా.. అయినా ప్రయోజనం లేదు: మోహన్ బాబు

  • రూ. 19 కోట్ల మేర ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి
  • ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు
  • ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాం

ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు నిరసనకు దిగారు. తిరుపతిలో విద్యార్థులు, తనయులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.

తమకు రూ. 19 కోట్ల మేర ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని... వాటి గురించి ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా స్వయంగా లేఖలు రాశానని... అయినా ఫలితం దక్కలేదని వాపోయారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. నిరసన కార్యక్రమంలో మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ లు కూడా పాల్గొన్నారు.

More Telugu News