Andhra Pradesh: నామినేషన్ దాఖలు చేసిన మంత్రి గంటా.. పవన్ కల్యాణ్ పోటీచేసినా గెలుపు తనదేనని వ్యాఖ్య!

  • విశాఖపట్నం నార్త్ నుంచి నామినేషన్
  • భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
  • అధికారంలోకి వచ్చేది టీడీపీయేనన్న గంటా

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతో కలిసి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న 40 సంవత్సరాల అనుభవమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని గంటా తెలిపారు.

ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గెలుపుపై తనకు ఎలాంటి అనుమానం లేదనీ, వచ్చే మెజారిటీపైనే తన దృష్టి ఉందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేళ ఇక్కడి నుంచి పోటీచేసినా విజయం తనదేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు మరోసారి అధికారం అప్పగించబోతున్నారని జోస్యం చెప్పారు.

More Telugu News