Andhra Pradesh: నాగబాబుపై పోటీకి కేఏ పాల్ రెడీ.. రేపు నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి అధినేత!

  • ప్రజాశాంతిని గెలిపిస్తే ఏపీని అమెరికా చేస్తా
  • పవన్, చంద్రబాబు, జగన్ హెలికాప్టర్ లో తిరుగుతున్నారు
  • అలా చేస్తూ మా పార్టీని ప్రమోట్ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఏపీని అమెరికాగా మార్చేస్తానని ప్రజాశాంతి అధ్యక్షుడు, మతప్రచారకుడు కేఏ పాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తాను నరసాపురం లోక్ సభ, భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని పాల్ వెల్లడించారు. ఇందుకోసం రేపు 20 లక్షల మంది మద్దతుదారులతో కలసి నామినేషన్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి గూడెం, తణుకు, ఆచంట తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాట్లు చేసినట్లు పాల్ చెప్పారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీకి చెందిన హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని కోరారు.

జగన్, పవన్, చంద్రబాబు రోజూ హెలికాప్టర్ లో తిరిగేస్తున్నారనీ, కానీ తన దగ్గర మాత్రం హెలికాప్టర్ లో తిరిగేందుకు డబ్బులు లేవని వాపోయారు. కానీ ఈ ముగ్గురు నేతలు హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజాశాంతి పార్టీ (ఎన్నికల గుర్తు)ని ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. నరసాపురం నుంచి జనసేన తరఫున ప్రముఖ నటుడు, మెగాబ్రదర్ నాగబాబు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News