Andhra Pradesh: తిట్టినా నవ్వుతూ వెళ్లిపోవడానికి నేను జగన్ కాదు.. నా జోలికి రావొద్దు!: రాధాకృష్ణకు పోసాని వార్నింగ్

  • నాలో జెంటిల్ మెనే కాదు డాబర్ మెన్ కూడా ఉన్నాడు
  • నా జోలికి రావొద్దని రాధాకృష్ణకు చెబుతున్నా
  • నేను ఎవ్వరికీ భయపడను

అనవసర విమర్శలు చేస్తే, తిడితే నవ్వుతూ వెళ్లిపోవడానికి తాను జగన్ మోహన్ రెడ్డి కాదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. తనలో జెంటిల్మెన్ మాత్రమే కాకుండా డాబర్ మెన్ కూడా ఉన్నాడని వ్యాఖ్యానించారు. తన జోలికి రావొద్దని ఏబీఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణను హెచ్చరించారు.

ఇప్పటికైనా రాధాకృష్ణ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ‘నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు.. కానీ నాలాంటి వాడి జోలికి రావొద్దని కోరుతున్నా’ అని చెప్పారు. ఇటీవల ఏబీఎన్ ఛానల్ లో తనపై ప్రసారమైన ఓ కథనంపై ఈరోజు పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎయిడ్స్ వచ్చేవాడికి ఎయిడ్స్ వస్తుందనీ, కేన్సర్ వచ్చేవాడికి కేన్సర్ వచ్చి తీరుతుందనీ, రాధాకృష్ణ లాంటి వాడికి మానసిక రోగం ఉందని ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని పునరుద్ఘాటించారు. తాను చచ్చేవరకూ ఇలాగే ఉంటాననీ, ఎవ్వరికీ భయపడనని స్పష్టం చేశారు.

మీడియా అంటే ప్రజలకు మిత్రపక్షంగా, ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కానీ రాధాకృష్ణ మాత్రం ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇకపై కొన్నాళ్లు అయినా మనిషిగా బతకాలని రాధాకృష్ణకు హితవు పలికారు.

More Telugu News