Andhra Pradesh: నాన్నా కుటుంబరావూ! అబద్ధం ఆడే బుద్ధి, వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే వున్నాయి!: పోసాని కృష్ణమురళి

  • ఈ విషయంలో చంద్రబాబుకు పేటెంట్ హక్కులు ఉన్నాయి
  • నేను నడవలేని స్థితిలో యశోదాలో ఉన్నట్లు ఏబీఎన్ లో చూపారు
  • నడవడానికి ఇబ్బందిగా ఉంది.. ఇంకా దివ్యాంగుడిని కాలేదు

తాను నడవలేని పరిస్థితుల్లో యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వచ్చిందని, అది వాస్తవం కాదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. ‘పోసాని చంద్రబాబును అప్రతిష్ట పాలుచేసేలా సినిమా తీశారు అని ఓ టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం నాకు నోటీసులు జారీచేసింది. వెంటనే నేను ఎలాంటి సినిమా తీయలేదు అని అధికారులకు జవాబిచ్చా. కానీ వాళ్లు ‘మీరు వ్యక్తిగతంగా వస్తే బాగుంటుంది’ అని కోరారు. దీంతో నా ఆరోగ్యం బాగోలేదు. ప్రస్తుతం స్వేచ్ఛగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా’ అని జవాబిచ్చినట్లు పోసాని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్యం చేసే ఎంవీ రావు గారే తనకు ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారని పోసాని తెలిపారు. తనకు నడవడానికి ఇబ్బంది ఉందనీ, అంతేతప్ప దివ్యాంగుడిని అయిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ వివరాలన్నింటిని తాను ఎన్నికల సంఘానికి పంపానన్నారు.

కానీ అదృష్టమో, దురదృష్టమో తాను ఈసీకి రాసిన లేఖ కాపీలు మీడియా చేతికి చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కలరింగ్ వేసిన ఏబీఎన్ ఛానల్.. ‘పోసాని చంద్రబాబుకు కులాన్ని ఆపాదించాడు. దీంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. తాను నడవలేని స్థితిలో ఉన్నందున విచారణకు రాలేనని పోసాని జవాబిచ్చారు’ అని కథనం ప్రసారం చేసిందని మండిపడ్డారు.

పోసాని నడవలేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని మీరెలా చూస్తారు? అని టీడీపీ నేత కుటుంబరావును మీడియా ప్రశ్నించారని చెప్పారు. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘చంద్రబాబుకు పోసాని కులాన్ని ఆపాదించడం తప్పు. ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగోలేకుంటే మేం సాయం చేస్తాం.

ఒకవేళ పోసాని అనారోగ్యంతో ఉన్నారన్న విషయం అబద్ధమైతే చాలాపెద్ద నేరమవుతుంది’ అని ఆయన చెప్పారన్నారు. ‘నాన్నా కుటుంబరావూ.. అబద్ధం ఆడే బుద్ధి, వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే వున్నాయి. భారతదేశంలో ఆ పేటెంట్ హక్కులు మీ చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి. అది మీరు తెలుసుకోవాలి..' అన్నారు పోసాని. 

More Telugu News