Hyderabad: అమ్మాయినంటూ నమ్మించి... టెక్కీని నిలువునా వంచించిన మరో టెక్కీ!

  • హైదరాబాద్ పోలీసుల అదుపులో ఐటీ ఉద్యోగి
  • చెల్లి వరసయ్యే అమ్మాయి ఫోటో పంపుతూ మోసాలు
  • రూ. 45 లక్షలు కాజేసినట్టు గుర్తించిన పోలీసులు

తాను ఓ అమ్మాయినంటూ కలరిచ్చిన ఓ ఐటీ ఉద్యోగి, మరో ఉద్యోగిని దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నెల్లూరుకు చెందిన శివమాధవ్ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. గత మూడేళ్లుగా డేటింగ్ వెబ్ సైట్లలో తానో అమ్మాయినని ప్రొఫైల్స్ ఉంచి, తన వలలో పడ్డవారిని మోసం చేస్తున్నాడు. తనపై ఆసక్తి చూపిన వారితో అమ్మాయిలా మాట్లాడేవాడు. తనకు చెల్లెలు వరసైన అమ్మాయి ఫోటో తనదిగా చూపించి మోసం చేసి డబ్బు గుంజుతుంటాడు.

ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అభినవ్ అనే యువకుడికి శివమాధవ్ ఫేక్ ప్రొఫైల్ నేమ్ మేఘన కనిపించగా, పరిచయం పెంచుకున్నాడు. ఫోటో పంపాలని అడుగగా, సోదరి వరసైన అమ్మాయి ఫోటో పంపాడు. ఆపై తన తండ్రికి బాగాలేదంటూ చెప్పి డబ్బులు వేయించుకున్నాడు. కలుద్దామని కోరితే, వాలెంటైన్స్ డే నాటికి నెల్లూరుకు రావాలని చెప్పి, అడ్రస్ ఇచ్చాడు. అక్కడ తన తల్లిదండ్రులకు ముందే చెప్పి, తాను ఇంట్లో లేనని అబద్ధం చెప్పించి, ముందే చూపిన ఫోటోను మరోసారి చూపించేలా చేశాడు.

మార్చిలో పెళ్లి పెట్టుకుందామని మోసం చేస్తూ, పెళ్లి ఖర్చులకు రూ. 10 లక్షలు కావాలని అడిగించాడు. దీన్ని నమ్మిన అభినవ్ ఆ డబ్బు ఇచ్చాడు. ఆపై ఎంత ట్రై చేసినా వారు కాంటాక్ట్ లోకి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. శివమాధవ్ ఇలా మొత్తం రూ. 45 లక్షలు కాజేశాడని తేల్చిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. హార్మోన్ల లోపం కారణంగా అమ్మాయి మాట్లాడినట్టుగా శివమాధవ్ గొంతు ఉందని, అతను స్వలింగ సంపర్కుడని, నాలుగేళ్ల క్రితం వివాహం జరుగగా, భార్య వదిలేసి వెళ్లిందని తేల్చారు. చేసిన అప్పులు తీర్చేందుకు తప్పుదారిలో నడిచాడని అన్నారు.

More Telugu News