Vijayawada: వైసీపీ నేత పీవీపీ ఓ అంతర్జాతీయ క్రిమినల్: టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • అమెరికాలో దొంగ కంపెనీలు పెట్టిన వ్యక్తి పీవీపీ
  • విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేశా
  • నగర అభివృద్ధికి కేంద్ర నిధులు కూడా రాబట్టా

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన ‘మన ఓటు- మన శక్తి’ పేరుతో ఓ పుస్తకం విడుదల చేశారు. విజయవాడ లోక్ సభ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ పుస్తకంలో వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీవీపీ ఓ అంతర్జాతీయ క్రిమినల్ అని, అమెరికాలో దొంగ కంపెనీలు పెట్టిన వ్యక్తి అని ఆరోపించారు. జగన్ డబ్బును హవాలా చేసింది పీవీపీనే అని, ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు బెయిల్ పై ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లోని నాదర్ గుల్ భూ కుంభకోణంలో పీవీపీ ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. పీవీపీ ఎలా మోసాలు చేశారో ‘ప్యారడైజ్ పేపర్స్’ వివరించిందని, ఆయన మోసాలు, అరాచకాలపై ఓ పుస్తకం వేయొచ్చని వ్యాఖ్యానించారు.

జగన్ తో జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని గతంలో విజయవాడ ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. విజయవాడను ఐదేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ కూడా సాధించామని, నగర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టామని కేశినేని నాని చెప్పారు.

More Telugu News