BJP: చంద్రబాబు జీరో అయ్యారు...ఆయన ఓటమి ఖాయం: బీజేపీ నేత సోము వీర్రాజు

  • మోదీని ఓడించాలన్న ధ్యాసలో ఆయన వాస్తవాలు మర్చిపోయారు
  • ప్రస్తుతం కొడుకును ముఖ్యమంత్రిని చేసే పనిలో ఉన్నారు
  • మంత్రి గంటా యూనిఫాం పేరుతో రూ.200 కోట్లు దోచేశారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు ఘాటైన విమర్శలు చేశారు. ప్రధాని మోదీని ఓడిస్తానని శపథం పట్టిన చంద్రబాబు తన తీరుతో తనకు తానే జీరోగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓ వైపు కమ్యూనిస్టులను, మరోవైపు సినీ నటుడు శివాజీని మోదీపైకి ఉసిగొల్పి విమర్శల దాడిచేయించారన్నారు.

చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ధ్యాస తప్ప ప్రస్తుతం చంద్రబాబుకు వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. ఇక విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్ముతో విశాఖ ఉత్తర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజును ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో విద్యాభివృద్ధి జరగకున్నా గంటా అభివృద్ధి చెందారని, స్కూల్‌ యూనిఫాం పేరుతో ఆయన రూ.200 కోట్లు కొట్టేశారని విమర్శించారు.

More Telugu News