YS Viveka: వివేకా హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారం!

  • సంచలనం సృష్టించిన వివేకా హత్య
  • గంగిరెడ్డి, పరమేశ్వర్ లపై బిగుస్తున్న ఉచ్చు
  • రూ. 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని, వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని అంటున్నారు.

హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్ కు సంబంధించి రూ. 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేశారని అధికారులు అంటున్నారు.

హత్య తరువాత గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గత నాలుగు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్లిన సిట్ అధికారులు, నేడు అతన్ని ప్రశ్నించనున్నారు.

More Telugu News