Guntur: నేనే డ్రైవర్ నెంబర్ వన్: గుంటూరులో సీఎం చంద్రబాబు

  • 15 లక్షల మంది ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత నాది
  •  మీరు ప్యాసింజర్లను సురక్షితంగా చేరుస్తారు
  • నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళుతున్నా

రాష్ట్రంలోని 15 లక్షల మంది ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తనదని మరొక్కసారి హామీ ఇస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లందరూ ముందుకు రావాలి. మీ ఆటోలో దినానికి యాభై మందో వంద మందో ఎక్కుతారు. వాళ్లతో చర్చ ప్రారంభించాలి. వాళ్లకు ప్రభుత్వం గురించి చెప్పాలి’ అని సూచించారు.

ఆటోలో ఎక్కిన ప్రయాణికులు టీడీపీకే ఓటు వేయాలని ముందుగానే నిర్ణయించుకుంటే వారిని మరింత హుషారు పరచాలని, ఊగిసలాటలో ఉన్న వారిని టీడీపీకి ఓటు వేసేలా, మన ప్రభుత్వం గురించి వివరించి చెప్పాలని, ఈ విషయాన్ని ఆటో డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ‘మీరు ఆ పని చేయండి.  మీ పదైదు లక్షల కుటుంబాలను కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు. ‘మనందరం డ్రైవర్లమే. మీరు ప్యాసింజర్లను సురక్షితంగా చేరుస్తారు. నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకుపోతున్నా. నేనే డ్రైవర్ నెంబర్ వన్’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News