Telugudesam: ​ బాలయ్య చిన్నల్లుడి టికెట్ విషయం సీఎంతో చెప్పిన గంటా

  • వైజాగ్ ఎంపీ స్థానంపై శ్రీభరత్ ఆసక్తి
  • బలపరుస్తున్న స్థానిక నేతలు
  • చంద్రబాబుతో చర్చించిన గంటా

టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ఎన్నికల బరిలో దిగే విషయంలో మరింత పురోగతి కనిపిస్తోంది. గీతం విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న శ్రీభరత్ కొన్నాళ్లుగా విశాఖ ఎంపీ స్థానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. శ్రీభరత్... బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని భర్త. శ్రీభరత్ తన తాతగారైన దివంగత ఎంవీవీఎస్ మూర్తి బాటలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని తమకు బాగా పట్టున్న వైజాగ్ పై దృష్టి పెట్టారు. స్థానిక నాయకులు కూడా శ్రీభరత్ అభ్యర్థిత్వాన్నే బలపరుస్తున్నారు.

విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై విశాఖ జిల్లా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు తదితరులు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అందరూ శ్రీభరత్ కు టికెట్ ఇచ్చే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీభరత్ విశాఖ లోక్ సభ స్థానంపై పోటీకి ఆసక్తిగా ఉన్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియజేశామని అన్నారు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రంలోగా చంద్రబాబు వైజాగ్ టికెట్ విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయని అన్నారు. 

More Telugu News