Andhra Pradesh: ఏ కులం వాడైనా సరే ఎవరూ చంద్రబాబుకు ఓటేయొద్దు: పోసాని కృష్ణమురళి

  • ఏపీలోని అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట
  • బాబుకు ఎవరైనా ఓటు వేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టే
  • మరొక్కసారి బాబుకు ఓటేస్తే ఆంధ్ర దేశం నాశనమే

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ రేంజ్ లో ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలచుకున్నాను. ఎవడు దొంగో..‘దొంగ’ అనే చెప్పండి. ఎవడు లుచ్ఛానో ‘లుచ్ఛా’ అనే చెప్పండి. ఎవడు మంచోడో..‘మంచోడు’ అనే చెప్పండి.

ప్రజలకు నేనేమి చెప్పదలచుకున్నానంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట చెబుతున్నాను. ఏ కులం వాడు కూడా ఇన్ క్లూడింగ్ ‘కమ్మ’.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు. అతనొక పెద్ద దొంగ.. అబద్ధాల మనిషి..అవినీతిపరుడు. ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తే, అది కమ్మ రాజ్యానికి, కమ్మ కులానికి, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టే. మరొక్కసారి చంద్రబాబుకు మీరు ఓటేసి గెలిపించారంటే, ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా గతంలో పీఆర్పీ తరపున పోసాని ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి సంఘటనను ప్రస్తావించారు. చంద్రబాబు ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టలేదని ఆరోపించారు. ఆరోజున చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చంద్రబాబు తన పార్టీ వాళ్లతో తిట్టించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే గెలిచిన చంద్రబాబు, ఈరోజున ఆయన్ని కూడా తిడుతున్నారని విమర్శించారు. ‘’ఇది మంచి..ఇది చెడు’ అని చెబుతున్న పవన్ కల్యాణ్ ని అమ్మలక్కలతో తిట్టిస్తావా? నిన్ననే ప్రెస్ మీట్ లో పనవ్ కల్యాణ్ బాధపడుతూ చెప్పాడు’ అని చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు.మొన్నటి దాకా మోదీ కాళ్లు పట్టుకుని, ఆయనకు శాలువా కప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అదే మోదీని హీనంగా తిడుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు సోనియా, రాహుల్ గాంధీలను తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్లను వాటేసుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News