PUBG: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ.. రైలు ఢీకొని ఇద్దరి మృతి

  • పబ్‌జీ ఆడుతూ లోకం మరిచిపోయిన యువకులు
  • రైలు ఢీకొనడంతో ఎగిరిపడిన యువకులు
  • మహారాష్ట్రలోని హింగోళీలో ఘటన

రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ గేమ్ ఆడుతున్న ఇద్దరు యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆటలో పడి లోకాన్ని మైమరచిపోయిన యువకులు రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేకపోయారు. ఫలితంగా రైలు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని హింగోళీలో జరిగిందీ ఘటన.

నగేశ్ గోరె (24), స్వప్నీల్ అన్నపూర్ణే (22) ఖట్కాలీ బైపాస్ వద్ద ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ ఆడుతుండగా హైదరాబాద్ నుంచి అజ్మేర్ వెళ్తున్న రైలు వారిని ఢీకొట్టింది. దాంతో వారు అమాంతం ఎగిరిపడ్డారు. రాత్రి పొద్దుపోయాక వారి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News