Vizag: మరదలికి బండి నేర్పుతూ... ఏలేరు కాలువలో పడి ఇద్దరూ మృతి!

  • విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • టూ వీలర్ పై వెంకటరమణ, ఉమాదేవి
  • అదుపుతప్పి కాలువలో పడిన బండి
  • ఒక మృతదేహం లభ్యం

తన మరదలికి ద్విచక్ర వాహనం నడపటం ఎలాగో నేర్పించాలన్న అత్యుత్సాహం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన విశాఖ జిల్లా నాతవరం సమీపంలోని చినగొలుగొండలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఐటీఐ చదువుతున్న లోవ వెంకటరమణ (20), ఇంటర్ చదువుతున్న ఉమాదేవి (18) బావా మరదళ్లు. వీరిద్దరూ టూ వీలర్ పై వెళుతున్న వేళ, ఏలేరు కాలువ సమీపంలో ఉమాదేవికి డ్రైవింగ్ నేర్పించే ఉద్దేశంతో వాహనాన్ని ఇచ్చిన వెంకటరమణ, బండి వెనుక కూర్చున్నాడు.

అయితే, ఉన్నట్టుండి కాలువ కట్టపై వాహనం అదుపుతప్పి నీళ్లల్లో పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు, నిన్న ఉదయం నుంచి వారి కోసం గాలించగా, ఉమాదేవి మృతదేహం మాత్రం లభ్యమైంది. వెంకటరమణ డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.

More Telugu News